ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్గిల్ చొరబాట్లు వద్దన్నందుకే తన ప్రభుత్వాన్ని కూల్చారు.. పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 09:13 PM

పాకిస్థాన్‌లో అధికార, విపక్షాలు.. ప్రధాని, మాజీ ప్రధాని మధ్య నిత్యం రాజకీయంగా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఒకరి ప్రభుత్వాన్ని పడగొట్టి మరొకరు అధికార పీఠాన్ని దక్కించుకోవడం సర్వసాధారణమే. ఇక ప్రభుత్వాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకునే సైన్యం.. తమకు వ్యతిరేకంగా మారిన ప్రధానులను గద్దె దించడం తరచూ జరుగుతూనే ఉంది. అయితే భారత్ పాకిస్థాన్ మధ్య 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం గురించి తాజాగా ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గుర్తు చేశారు. కార్గిల్‌లో పాక్ సైన్యం అక్రమ చొరబాట్లను తాను వ్యతిరేకించినందుకు తన ప్రభుత్వాన్ని కూలదోశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ సహా ప్రపంచంలోని ఇతర దేశాలతో ఎల్లప్పుడూ తాను సన్నిహిత సంబంధాలు కోరుకుంటానని నవాజ్ షరీఫ్ చెప్పారు.


1999లో భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న కార్గిల్‌ యుద్ధానికి అప్పటి పాక్ సైనిక జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కారణమని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ ముస్లింగ్‌ లీగ్‌ నవాజ్‌ అధినేత నవాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. కార్గిల్‌ వద్దన్నందుకే 1999 లో తన ప్రభుత్వాన్ని పర్వేజ్ ముషారఫ్‌ కూలగొట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్థాన్‌లో ఇప్పటికే ఆపద్ధర్మ ప్రభుత్వం పాలన సాగిస్తుండగా.. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తన పార్టీ తరఫున టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థులతో శనివారం సమావేశం నిర్వహించిన నవాజ్‌ షరీఫ్.. భారత్‌ సహా పొరుగు దేశాలతో పాకిస్థాన్ సత్సంబంధాలు కోరుకుంటోందని చెప్పారు.


ఈ క్రమంలోనే తన పదవీకాలం పూర్తి కాక ముందే పాక్ ప్రధాని పదవి నుంచే తనను అన్యాయంగా దించేశారని నవాజ్‌ షరీఫ్ తెలిపారు. 1993, 1999 లో ఇదే జరిగిందని తెలిపారు. కార్గిల్‌లో చొరబాట్లను తాను తీవ్రంగా వ్యతిరేకించానని.. అందుకే పర్వేజ్ ముషారఫ్‌ తన ప్రభుత్వాన్ని కూలదోశారని చెప్పారు. ప్రపంచ దేశాలతో పాక్ మంచి సంబంధాలు కలిగి ఉండాలనేదే తన కోరిక అని నవాజ్ షరీఫ్ తెలిపారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడే భారత్‌కు చెందిన ఇద్దరు ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయ్, నరేంద్ర మోదీ.. పాక్‌లో పర్యటించారని గుర్తు చేసుకున్నారు. భారత్‌ సహా అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌తో సంత్సంబంధాలు కలిగి ఉండడం అవసరం అని నవాజ్‌ పేర్కొన్నారు. చైనాతోనూ బలమైన స్నేహ బంధం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.


ఈ క్రమంలోనే చుట్టు పక్కల ఉన్న దేశాల కంటే పాక్‌ ఆర్థికంగా వెనకబడడంపై నవాజ్‌ షరీఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. దేశాన్ని తీవ్రంగా భ్రష్టు పట్టించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇమ్రాన్‌ ఖాన్ హయాంలో 2018 నుంచి 2022 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయిందని ఆరోపించారు. 2022 ఏప్రిల్‌ తర్వాత షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం మళ్లీ దేశాన్ని గాడిన పెట్టిందని పేర్కొన్నారు. పాక్ పరిస్థితి ఇంతలా దిగజారిపోవడానికి కారణమైన వారందరని బాధ్యుల్ని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ జావేద్‌ బజ్వా, ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్‌ ఫియాజ్‌ హమీద్‌, పాక్ మాజీ ప్రధాన న్యాయమూర్తులు తన ప్రభుత్వం కూలదోయడం, ఆర్థికంగా దేశాన్ని దిగజారిపోయేలా చేయడానికి కారణమని నవాజ్‌ షరీఫ్ ఆరోపించారు. పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8 వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గత నాలుగేళ్లుగా లండన్‌లో ఉంటున్న నవాజ్ షరీఫ్‌ కొన్ని వారాల క్రితమే పాక్‌ చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com