అనితకు క్షమాపణ చెబితేనే అసెంబ్లీలోకి
మరో ఏడాది సస్పెన్షన్కు నేతల పట్టు
అదే జరిగితే కోర్టుకు వెళ్లే యోచనలో రోజా
విజయవాడ, మేజర్న్యూస్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా మళ్లీ మరో ఏడాది పాటు సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు, ఇతర ఆరోపణలతో సంవత్సరం పాటు అసెంబ్లీకి దూరమైన రోజా నవ్యాంధ్ర వెలగపూడిలో జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే తనకు జరిగిన అవమానానికి ఇంత వరకు రోజా క్షమాపణ చెప్పలేదంటూ అనిత ఇటీవల మనోవేదనను తెలిపారు. సంవత్సరం పాటు రోజాను అసెంబ్లీకి నిషేధం విధించాక ఇంకా క్షమాపణ ఏంటంటూ వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అసలు అప్పటి సంఘటనలో తనేమీ ఉద్దేశ్య పూర్వకంగా అనితను అవమానకరంగా వ్యాఖ్యానించలేదని రోజా చెప్పారు. ఏ తప్పు చేయకుండా క్షమాపణ చెప్పనని ఆమె అన్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు గట్టిగా పట్టుకున్నారు. దళిత ఎమ్మెల్యేను అవమానించి దర్జాగా అసెంబ్లీకి వస్తే ఊరుకునేది లేదని, క్షమాపణ చెప్పాకే అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు తేల్చిచెప్పారు. తాజాగా ఇదే విషయమై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ కూడా రోజాను హెచ్చరించారు. 24 గంటల్లో అనితకు క్షమాపణ చెప్పకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మరీ స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే రోజాను మరో ఏడాది పాటు సస్పెండ్ చేయడం ఖాయంగా తెలుస్తుంది. అయితే తనను ఇప్పటికే అకారణంగా సస్పెండ్ చేశారని రోజా భావిస్తున్నారు. మళ్లీ అలాగే చేయాలని చూస్తే మళ్లీ కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నాళ్ల నుంచో రోజా రాజకీయాల్లో ఉన్నా ఎమ్మెల్యే అయింది మాత్రం ఇదే మొదటిసారే. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన రోజా నాటి నుంచి తరచుగా వార్తల్లో నిలుస్తూ బాగా క్రేజ్ సంపాదించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష అధినేత జగన్మోహన్రెడ్డి తరువాత రోజానే పవర్పుల్గా నిలిచారు. రోజా ను అసెంబ్లీకి ఏడా ది పాటు సస్పెండ్ చేయడం, ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్స వానికి హాజర య్యేందుకు వచ్చి న రోజాను వెనక్కి పంపడం వంటి సంఘ టనలతో ఆమె మరింత పాపులర్ అయ్యారు. రోజాకు ఆన్ లైన్లో 11 లక్షల మంది ఫాలోవర్స ఉన్నారు. పాజిటివ్గానో, నెగిటివ్గానో రోజాకు పాపులారిటీ వచ్చింది. అసలే సినీ హీరోయిన్. అందులోనూ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి టీడీపీపైనే గట్టిగా విమర్శలు చేయడం గమనార్హం. ఓ ప్రముఖ టీవీ చానల్లో జబర్దస్త ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రోజా విషయంలో ఏమి జరిగినా ఎక్కువ శాతం ప్రజలు గమనిస్తుండడం, చర్చించడం ఖాయం. ఈ అంశంపై కూడా టీడీపీ యోచిస్తూ వ్యవహరిస్తుందో లేదో వేచిచూడాలి.