ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాఖండ్ సొరంగం నుంచి 41 మంది వెలుపలికి,,,17 రోజుల అనంతరం సురక్షితంగా బయటకు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 09:00 PM

ఉత్తరాఖండ్‌ సొరంగం నుంచి 41 మంది కూలీలను మంగళవారం రాత్రి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 17 రోజుల తర్వాత వారంతా బాహ్య ప్రపంచాన్ని చూడగలిగారు. స్టీల్ పైపు ద్వారా బయటకు తీసుకొచ్చిన వెంటనే.. వారందరికీ మెడికల్ టెస్టులు చేసి, హాస్పిటల్‌కు తరలించారు. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎవరికీ ఆరోగ్యం విషమంగా లేదని ఉత్తరాఖండ్ సీఎం తెలిపారు.


సొరంగంలో చిక్కుకపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఈ 17 రోజులపాటు చేయని ప్రయత్నమంటూ లేదు. నవంబర్ 12న సొరంగంలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు డ్రిల్లింగ్ చేపట్టారు. ఆస్ట్రేలియాకు చెందిన టన్నెల్ ఎక్స్‌పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ సైతం అక్కడకు చేరుకున్నారు. అమెరికాకు చెందిన ఆగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఆర్మీని సైతం రంగంలోకి దింపారు. చివరికి ర్యాట్ హోల్ మైనర్లు కొండను తవ్వడంతో.. చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం సాధ్యమైంది.


నవంబర్ 12 తేదీ ఉదయం ఆరు గంటల సమయంలో సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. అప్పటికే అందులో 41 మంది పని చేస్తున్నారు. టన్నెల్ అకస్మాత్తుగా కూలిపోయింది.. దీంతో భారీ శబ్దం వచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం కాలేదు. నా చెవులు మొద్దుబారిపోయాయని సొరంగంలో చిక్కుకుపోయిన అఖిలేష్ సింగ్ అనే కార్మికుడు తెలిపారు. ఆ తర్వాత 18 గంటలపాటు బాహ్య ప్రపంచంతో వారికి సంబంధం లేకుండా పోయాయి.


సొరంగం తవ్వే పని ప్రారంభించడానికి ముందే అది కూలిపోతే ఏం చేయాలనే విషయమై కార్మికులకు శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణే ఇప్పుడు 41 మందికి ఉపయోగపడింది. తాము సొరంగంలో చిక్కుకుపోయామని తెలిసేందుకు వీలుగా.. వారు వాటర్ పైప్‌ను ఓపెన్ చేశారు. దాంట్లో నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయంటే.. సొరంగంలో ఎవరో చిక్కుకుపోయారని బయటున్న వాళ్లు భావిస్తారు. దీంతో వెంటనే ఆ పైప్ ద్వారా వారికి ఆక్సిజన్ పంపించడం మొదలుపెట్టారు. సొరంగం కూలిన రెండో రోజే శిథిలాల గుండా 4 అంగుళాల వెడల్పున్న ఓ స్టీల్ పైపును పంపించి దాని ద్వారా డ్రై ఫ్రూట్స్, నీరు, ఆక్సిజన్ అందించారు. సొరంగం నుంచి 41 మంది బయటకు వచ్చే సమయానికి వారి దగ్గర 25 రోజులకు సరిపడా ఆహారం ఉంది. పదో రోజుకు గానీ ఎండోస్కోపీ కెమెరాల ద్వారా టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారిని చూడటం సాధ్యం కాలేదు.


సొరంగంలో 41 మంది ఉండటం, తిరిగేందుకు 2 కి.మీ. ప్రదేశం ఉండటంతో వారు ధైర్యంగానే ఉన్నారు. కాలక్షేపం కోసం వారు ఫోన్లో లూడో ఆడటంతోపాటు సొరంగంలో ఊటగా వచ్చిన నీళ్లలో స్నానం చేశారు. తమకు ఏదో అయిపోతుందనే భయాన్ని తగ్గించడం కోసం, కాలక్షేపం కోసం వారికి పేకలు, లూడో, చెస్ బోర్డులు పంపించారు. ఒత్తిడి తగ్గించుకోవడం కోసం వారు సరదాగా దొంగ పోలీసు ఆడటంతోపాటు యోగా, ఎక్సర్‌సైజ్ చేశారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారు మానసికంగా ధైర్యంగా ఉండటం కోసం డాక్టర్ల బృందం నిత్యం వారితో మాట్లాడింది. సెల్‌ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో బయటి వాళ్లతో మాట్లాడటం వారికి సాధ్యం కాలేదు. దీంతో తమలో తాము మాట్లాడుకుంటూ ధైర్యం సడలకుండా జాగ్రత్తపడ్డారు. ఉదయాన్నే వాకింగ్ చేస్తూ.. యోగా చేస్తూ.. సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com