న్యూఢిల్లీ: పేద, మధ్యతరగతి ప్రజలను గట్టెక్కించడానికి కేంద్రం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతుంది. ఇకనుంచి నగరాల్లోని అద్దె ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలకు కేంద్రమే అద్దె చెల్లించనుంది. తాజాగా కేంద్రం ఎంపిక చేసిన 100స్మార్ట్ నగరాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే మొత్తం కన్నా అద్దె చెల్లింపు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ భారాన్ని అద్దెదారుడే భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన కేంద్రం ఇచ్చే డబ్బులతో పూర్తి స్థాయిలో అద్దె చెల్లింపులు జరపలేకపోయినా కొంతలో కొంత ఊరటనిచ్చేదిగా ఈ స్కీమ్ ఉండనుంది. ఈ స్కీమ్ కోసం దాదాపు రూ.2700కోట్లతో కేంద్రం ఇప్పుడు కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త రెంటల్ హౌజింగ్ పాలసీని 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలనే యోచనలో కేంద్రం ఉంది. అయితే ఈ స్కీము ద్వారా నేరుగా డబ్బులు కాకుండా అద్దెదారులకు ఓచర్లు అందించనున్నారు. ఆ ఓచర్లను ఇంటి యజమానులకు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి యజమానులు ఈ ఓచర్లను ఏ పౌర సేవా కేంద్రంలోనైనా మార్చుకోవచ్చును. ఇకపోతే అద్దె చెల్లింపులకు రూపొందించే మార్గదర్శకాలను స్థానిక పరిస్థితులు, ఆర్థిక స్థితులు, మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయించనున్నారు. ఓచర్ల స్థానంలో నేరుగా డబ్బులు ఇస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రధాని మోడీ 'హౌసింగ్ స్కీమ్ ఫర్ ఆల్' కార్యక్రమంలో భాగంగా ఈ స్కీముకు రూపకల్పన చేసినట్టు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. రానున్న రోజుల్లో గృహాల కొరతను నిరోధించేందుకు, నిర్మాణ రంగాల్లో గృహాల లభ్యతను పెంచేందుకు బినామీ ఆస్తులు, నిర్మాణాలపై కఠిన చర్యలు సైతం తీసుకోనున్నట్టు తెలిపారు. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 27.5 శాతం మంది అద్దె ఇళ్లల్లో నివసిస్తుండగా నేషనల్ శాంపిల్ ప్రకారం 35 శాతం మంది అద్దె ఇళ్లల్లో ఉంటున్నట్లు తేలింది.