అమరావతి, మార్చి10 : రాష్ట్రంలోని బ్యాంకులలో నగదు కొరత పరిస్థితిని చక్కదిద్దటానికి రిజర్వుబ్యాంకుకు లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం తన కార్యాలయంలో ఆయన బ్యాంకర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి బ్యాంకులలో నగదు కొరతపై సమీక్ష చేశారు. మళ్లీ రిజర్వుబ్యాంకు గవర్నర్ కు లేఖరాస్తానని, రాష్ట్రానికి సరిపడా నగదు సరఫరా పెంచాలని కోరతామని వివరించారు.పెట్రోల్ బంకులకు బ్యాంకులు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను ఇవ్వటం లేదని యజమానులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు.బ్యాంకుల నుంచి డిజిటల్, నాన్ డిజిటల్ లావాదేవీలపై తనకు నివేదిక సమర్పించాలని చంద్రబాబు కోరారు.తన ఆధ్వర్యంలోని డిమోనిటైజేషన్ కమిటీ సమర్పించిన సిఫారసులలో ఎన్ని అమలు చేస్తున్నారో తనకు తెలియజేయాలని ఆదేశించారు.డీమోనిటైజేషన్ తర్వాత పరిస్థితి పునరావృత్తం కానివ్వరాదని ఆయన అన్నారు.రాష్ట్రంలో నగదు నిల్వలు, నగదు సరఫరా పెంచాలని గత వారం తాను రిజర్వుబ్యాంకుకు లేఖరాశానని, మళ్లీ రిజర్వు బ్యాంకు గవర్నర్ తో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారు. డిజిటల్ లావాదేవీలపై సమీక్షించాలన్నారు. బ్యాంకులు నగదు లావాదేవీలపై విధిస్తున్న అదనపు చార్జీలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందువల్ల ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. తిరిగి డీమోనిటైజేషన్ నాటి పరిస్థితి రానివ్వరాదన్నారు. నగదు కొరతపై రిజర్వు బ్యాంకు తక్షణం స్పందించాలని కోరారు. నియంత్రణ చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు.నగదు ఉపసంహరణపై నియంత్రణ పెడితేనే బాగుంటుందన్న పరిస్థితి రాకూడదని ముఖ్యమంత్రి చెప్పారు.శుక్ర, శనివారాల్లో మరోసారి సమావేశమవుదామని, ఈలోగా నివేదిక సిద్ధం చేయాలన్నారు.