తిరువనంతపురం: వందేళ్లలో ఎన్నడూ చూడని భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన కేరళ భారీ నష్టాన్ని చవిచూసింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కేరళకు కొన్నేళ్లు పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వరదల కారణంగా రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇడుక్కి, మలప్పురం, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. లక్షకుపైగా ఇండ్లు ధ్వంసమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షల ఎకరాల్లో పంట నేలమట్టమైంది. ప్రస్తుతం జరుగుతున్న సహాయక కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత కచ్చితమైన నష్టాన్ని లెక్క వేయనున్నారు. ఇప్పటికీ పది లక్షల మందికిపైగా ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నట్లు సీఎం పినరయి విజయన్ చెప్పారు.
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం పూర్తిగా కోలుకోవాలంటే కనీసం పదేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వరదల తర్వాత సాధారణంగా సహాయక, పునరావాస పనులు సగటున రెండేళ్లు జరుగుతాయని, పర్యావరణం కోలుకోవడానికి ఐదేళ్లకుపైగా పడుతుందని 2015లో ప్రకాశ్ త్రిపాఠి అనే ప్రొఫెసర్ చేసిన అధ్యయనం తేల్చింది. ఇక భవిష్యత్తులో వరదల వల్ల నష్టాన్ని సాధ్యమైనంత వరకు తక్కువ చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హిమాంషు థక్కర్ అనే మరో నిపుణుడు చెప్పారు. దీనికి చాలా సమయంల పడుతుందని ఆయన తెలిపారు. గతంలో ఇలాంటి వరదల కారణంగా ఉత్తరాఖండ్, బీహార్, అస్సాంలాంటి రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోయాయి.