నవ్య క్యాట్ కార్డ్,వనిత ఫ్యామిలీ కార్డులకు కాలం చెల్లిపోయింది. ఈ రోజు నుంచి ఆ కార్డుల విక్రయాలను ఎపిఎస్ఆర్టిసి నిలిపివేసింది. చిల్లర సమస్యను అధిగమించేందుకు టికెట్ ధరల్లో సవరణలు చేసిన ఆర్టీసీ... ఇప్పుడు క్యాట్ , వనితి కార్డులకు కూడా మంగళం పాడేసింది. ఏపీఎస్ఆర్టీసి తరచూ రాకపోకలు సాగించే ప్రయాణికులకు రాయితీ కల్పించేందుకు ఉద్దేశించిన నవ్య క్యాట్ కార్డ్, వనిత ఫ్యామిలీ కార్డులకు వాలిడిటీ అయిపోయింది. బుధవారం నుంచి వాటి విక్రయాలను ఏపీఎస్ఆర్టీసీ నిలిపివేయనుంది. చిల్లర సమస్యను అధిగమించడం పేరిట ఇటీవల తెలుగువెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్ సహా అన్ని స్పెషల్ టైపు సర్వీసు బస్సుల్లో ఛార్జీలను ఆర్టీసీ సవరించిన సంగతి విదితమే. ఛార్జీలు సవరించడం వల్ల టిక్కెట్ ధరలు 10, 15, 20 రూపాయలుగా మారిపోయాయి. ఇలా ధరలు మార్చిన ఆర్టీసీ క్యాట్ కార్డులు, వనిత ఫ్యామిలీ కార్డు దారుల విషయంలో అదే ఇబ్బందిని ఎదుర్కొంటోంది. 20 రూపాయల టికెట్ మీద పది శాతం రాయితీ ఇస్తే మళ్లీ అదే చిల్లర సమస్య తలెత్తుతోంది. కొన్ని మార్గాల్లో వీరికి అసలు ఒక్క శాతం రాయితీ కూడా దక్కకపోతుండగా, మరికొన్ని మార్గాల్లో రాయితీ శాతం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో దీనిపై వారం రోజులుగా అధ్యయనం చేసిన ఆర్టీసీ.. ఈ రెండు కార్డులను మార్కెటింగ్ చేయడం ఆర్థికంగా ప్రయోజనకరం కాదని భావించి అమ్మకాలను నిలిపేయాలని నిర్ణయించింది.ఈ నిర్ణయం దాదాపు ఏడు లక్షల మందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఈ రెండు రకాల కార్డులు తీసుకుని ఉన్నవారికి మాత్రం వాటి గడువు ముగిసే వరకూ టిక్కెట్టుపై పది శాతం రాయితీ కొనసాగించనున్నారు. నవ్య క్యాట్ కార్డ్, వనిత ఫ్యామిలీ కార్డుల ద్వారా ఇప్పటివరకు ఆర్టీసీ చాలా లాభాన్ని ఆర్జించింది. 2015 నుంచి 2017 డిసెంబరు వరకూ నవ్య కార్డు విక్రయాల ద్వారా.... 17కోట్ల 98 లక్షల మేర ఆదాయం వచ్చింది. తెల్లరేషన్ కార్డున్న వారికి వనిత ఫ్యామిలీ కార్డు ఇస్తారు. 2015 నుంచి 2017 డిసెంబరు వరకూ వనిత కార్డును విక్రయించడం ద్వారా సుమారు 5కోట్ల 15 లక్షల మేర ఆదాయం లభించింది. కానీ ప్రస్తుతం ఆర్టీసీ తీసుకున్న ఛార్జీలో మార్పు నిర్ణయం వల్లే ఏళ్ల తరబడి ఎంతో మందికి ఉపయోగ పడి నవ్య, వనిత కార్డులు.. ఇక గతంగా మిగిలిపోతున్నాయి.