భారీ వర్షం కారణంగా వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర రద్దైంది. ఈ విషయాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అభిమానులు, కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఉదయం సెషన్ ను మాత్రమే రద్దు చేశామని... మధ్యాహ్నానికి వర్షం తగ్గితే, పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. వర్షం తగ్గని పక్షంలో రేపు ఉదయం పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ రోజు జరగాల్సిన సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశం కూడా రద్దయినట్టు ఆయన ప్రకటించారు. జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా చింతలపల్లి వద్ద కొనసాగుతోంది. పాదయాత్ర ఆగిపోవడానికి ముందు జగన్ ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. జెండా ఊపి, ఒలింపిక్ రన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.