విశాఖ: కుట్ర రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీల తీరుకు నిరసనగా విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో ‘వంచన వ్యతిరేక దీక్ష’ శిబిరంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఏపీకి హోదాపై తెలుగు ప్రజలను వంచించింది చంద్రబాబేనన్నారు. పోలవరాన్ని మేము ఆపుతున్నామా..? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ ప్రారంభిస్తే కమిషన్ల కోసం దోపిడీకి పాల్పడుతోంది మీరు కాదా? అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణాన్ని మేము అడ్డుకుంటున్నామా? అని ప్రశ్నించిన రోజా బాహుబలి గ్రాఫిక్స్ చూపిస్తూ మోసం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఐదు కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేసింది సీఎం చంద్రబాబేనని అన్నారు. మోడీ మట్టి, నీరు ఇస్తుంటే టీడీపీ నేతలు, మంత్రులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కుట్ర రాజకీయాలతో ప్రజలను వంచించింది టీడీపీనేనని విమర్శించారు. బాబు చేస్తుంది పోరాటం కాదు పబ్లిసిటీ ఆరాటం అని విమర్శించారు.