స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం(ఎల్సీఏ) తేజస్ మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. భారత సైన్యంలో చేరేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. గోవా తీరంలో తేజస్ విమానం నుంచి బీవీఆర్(బియాండ్ విజువల్ రేంజ్) గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మిసైల్ను శుక్రవారం ప్రయోగించగా నిర్వహణకు అవసరమైన లక్ష్యాలను అది చేరుకుందని రక్షణ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. తేజస్ నుంచి ఆయుధాలు, క్షిపణులను ప్రయోగించేందుకు ఇంతకుముందే అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.
బీవీఆర్ మిసైల్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో త్వరలోనే ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్(ఎఫ్సీవో) జారీ చేసే ప్రక్రియ వేగవంతమవుతుందని అధికారులు చెప్పారు. ఈ యుద్ధవిమానాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్), డీఆర్డీవో ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలెప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రపంచస్థాయి అధునాత సాంకేతికతో తేజస్ను రూపొందించడంలో భాగమైన డీఆర్డీవోతో పాటు మిగతా ఏజెన్సీలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు.