న్యూఢిల్లీ : ఈ ఉదయం ప్రారంభం కాగానే మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడిన లోక్ సభ తిరిగి ప్రారంభం అయ్యింది. అయితే విరామం తరువాత కూడా సభలో అదే సీన్ రిపీట్ అవుతోంది. టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోని వెళ్లి తమ డిమాండ్లపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ సభ ఆర్డర్ లో ఉండాలని, సభ్యులు తమతమ స్థానాలలో కూర్చోవాలని పదేపదే కోరతున్నారు. సభలో గందరగోళం మధ్యే సభా వ్యవహారాల మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ సభ్యులు ప్రస్తావించిన ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం, వైకాపాల అవిశ్వాసంపై కూడా మోడీ సర్కార్ చర్చకు సిద్ధంగా ఉందన్నారు. అయితే సభ ఆర్డర్ లో ఉండాలన్నారు. వెంటనే స్పీకర్ సభా కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రులను సంబంధిత పేపర్లను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం తెలుగుదేశం, వైకాపాల అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయనీ సభ ఆర్డర్ లో లేనందున అవిశ్వాసంపై చర్చ చేపట్టే అవకాశం లేదంటూ సభను రేపటికి వాయిదా వేశారు.