న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ తో కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం, వైకాపా లు నేడు కూడా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలూ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్ సభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. ఇప్పటి వరకూ ఈ రెండు పార్టీలూ రెండు సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. అయితే సభ ఆర్డర్ లో లేదంటూ స్పీకర్ వాటిపై చర్చకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మూడో సారి ఇరు పార్టీలూ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడైనా చర్చ జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అన్నాడీఎంకే, తెరాసాలు వాటి వాటి డిమాండ్ లతో వెల్ లోకి వెళ్లి ఆందోళన చేస్తుండటంతో స్పీకర్ సభ ఆర్డర్ లో లేదంటూ సభను వాయిదా వేస్తున్నారు. ఇలా ఉండగా సభను ఆర్డర్ లో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం, స్పీకర్ దేననీ, ఆ బాధ్యత తీసుకోకుండా అవివ్వాస తీర్మానంపై చర్చ రాకుండా చేసి ప్రభుత్వం పారిపోతోందని తెలుగుదేశం విమర్శిస్తున్నది.