భోపాల్: త్వరలో దేశ ప్రజలకు కేవలం రూ.5పైసలకే లీటర్ మంచినీళ్లను అందిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సముద్రజలాన్ని తాగునీరుగా మార్చే ప్రక్రియ తమిళనాడులోని ట్యూటికోరన్లో ప్రారంభమైందని చెప్పారు. నర్మదా నదీ తీరంలో బంద్రబాన్లో నదీ మహోత్సవ్(రివర్ ఫెస్టివల్) పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. నీటి పంపకాలపై రాష్ర్టాలు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం, కోర్టులకు వెళ్లడం మంచిదికాదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నదీజలాల పంపకాల కోసం కొన్ని రాష్ర్టాలు గొడవ పడటం దురదృష్టకరం. కానీ, పాకిస్థాన్కు ప్రవహిస్తున్న నదీ జలాల గురించి ఏ ఒక్కరికీ కూడా ఆందోళనగా లేదు. పాక్తో సరిహద్దులో భారత్ 6 నదులను పంచుకుంటోంది. భారత్ నుంచి మూడు నదుల నీరు పాకిస్థాన్కు ప్రవహిస్తోంది. ఏ ఒక్క వార్తాపత్రిక అయినా దాని గురించి కథనాన్ని ప్రచురించిందా? ఆ నీటిని ఆదేశానికి వెళ్లకుండా అడ్డుకోవాలని ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా డిమాండ్ చేశారా? అని గడ్కరీ తన ప్రసంగంలో ప్రశ్నించారు. భారత్లో నీళ్లే అతిపెద్ద సమస్య. నీటితో పాటు అడవులు, జంతువులను కాపాడినప్పుడే మనం ముందుకెళ్లగలం. ఎందుకంటే మన జీవన విధానం వాటితో ముడిపడి ఉందన్నారు.