ఏదైన మంచి కార్యం తలపెట్టే ముందు రజనీకాంత్ హిమాలయాలకి వెళ్ళి అక్కడ ఆధ్యాత్మిక గురువుల ఆశీర్వాదం తీసుకోవడం అలవాటు. గతంలో పలు సందర్భాలలో హిమాలయాలకి వెళ్ళిన రజనీ మరోసారి అక్కడికి వెళుతున్నారు. తాను త్వరలో పార్టీ స్థాపించే క్రమంలో ఈ ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నట్టు సమాచారం. శనివారం సిమ్లాకి వెళ్లిన రజనీ అక్కడినుండి ధర్మశాల చేరుకున్నారు. అక్కడ ఆధ్యాత్మిక గురువులు రజనీకి ఘన స్వాగతం పలికారు. ఈ రోజు రిషికేత్ష్ పాటు పలు పుణ్యక్షేత్రాలని రజనీకాంత్ దర్శించనున్నట్టు తెలుస్తుంది. ఆధ్యాత్మిక పర్యటనలో గురువుల ఆశీర్వాదాలతో పాటు వారు చెప్పే రాజకీయ పరమైన సూచనలని కూడా ఆయన తీసుకోనున్నట్టు తెలుస్తుంది. రజనీకాంత్ ఇటీవల హిమాలయాలలో ఓ ఆశ్రమాన్ని కూడా నెలకొల్పారు. ఆయన తమిళ సంవత్సరాది సందర్భంగా తన పార్టీ ప్రకటన చేయనున్నాడని తెలుస్తుండగా ఈ పార్టీకి ‘రజినీకాంత్ మక్కల్ మంద్రమ్’ పేరు పెడతారని తమిళ తంబీలు అంటున్నారు. రానున్న ఎన్నికలలో 234 స్థానాలలో తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేయనున్నారనే విషయం రజనీ గత ఏడాది ప్రకటించిన విషయం విదితమే. తలైవా నటించిన కాలా, 2.0 చిత్రాలు విడుదల కావలసి ఉంది.