తిరువనంతపురం : మానవత్వం లేని కొందరు మనుషులు మతిస్థిమితం లేని వ్యక్తిని కట్టేసి సెల్ఫీలు దిగారు. ఆ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నాడని చితకబాది కొన్ని గంటలపాటు హింసించారు. ఈ దారుణ ఘటన పాలక్కడ్ జిల్లాలోని అట్టప్పడి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మతిస్థిమితం సరిగా లేని 27 ఏళ్ల వ్యక్తి అటవీ ప్రాంతానికి దగ్గరున్న ఓ గ్రామంలో నివసిస్తున్నాడు. అయితే సమీపంలో ఉన్న దుకాణాల్లో ఆ వ్యక్తి దొంగతనాలు చేస్తున్నాడన్న నెపంతో అతడిని స్థానికులు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ సమయంలో కొందరు యువకులు సెల్ఫీలు తీసుకున్నారు. మతిస్థిమితం కోల్పోయిన బాధితుడిని కొన్ని గంటల పాటు హింసించారు. స్పృహ తప్పి పడిపోయాడు. మానవత్వమున్న కొందరు మనుషులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని.. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.