ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 11:54 AM

సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘బయోమెట్రిక్‌’ విధానం స్థానంలో ‘ఫేషియల్‌ అథంటికేషన్‌’ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కొత్త విధానంలో ముఖం ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తారు. ప్రస్తుతం లబ్ధిదారుల వేలిముద్రలను సేకరించి, వాటిని లబ్ధిదారుని ఆధార్‌ నమోదు సమయం నాటి వేలిముద్రలతో పోల్చి ధృవీకరించుకుంటున్నారు. అదే ఫేషియల్‌ ఆథంటికేషన్‌ విధానం అమలులోకి వస్తే వేలిముద్రలకు బదులు లబ్ధిదారుని ముఖాన్ని, అతడి ఆధార్‌ లోని ముఖకవళికలతో పోల్చి ధృవీకరించుకుంటారు. ప్రస్తుతం అమలు చేస్తున్న బయోమెట్రిక్‌ విధానంలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక సమస్యలు తలెత్తున్నాయి. ఐరిష్‌ విధానం అమలు చేసినా కళ్ల శుక్లం ఆపరేషన్‌ చేసుకున్న వారితో సమస్యలు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానాన్ని అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.


ఫేషియల్‌ అథంటికేషన్‌ విధానంలో మొబైల్‌ యాప్‌ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్‌ చేస్తే, అది ఆధార్‌ కు అనుసంధానమై లబ్ధిదారుని సమాచారంతో సరిపోల్చుకుంటుందని అధికారులు తెలిపారు. బయోమెట్రిక్‌ స్థానంలో ఫేషియల్‌ అథంటికేషన్‌ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో పాటు యూఏడీ విభాగం అనుమతి తప్పనిసరి. ఇవి ఈ విధానాన్ని ఏపీలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి అనుమతి తెలిపాయి. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో మొదటగా అమలు చేస్తున్నారు. కార్యాలయంలోని మొత్తం 150 మంది సిబ్బంది హాజరును పరిశీలిస్తారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖ, యూఏడీ విభాగం తుది ఆమోదం కోసం నివేదిక సమర్పిస్తారు. ఆ తర్వాతే అన్ని సంక్షేమ పథకాల అమలులో ఈ విధానం ప్రవేశపెట్టేందుకు వీలు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com