ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ జెడ్పీటీసీ, టీడీపీ నాయకురాలు బత్తిని శారద ఇంట్లోకి దూరి సామాగ్రిని ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. శారద ఇంట్లో ఉన్న సామాగ్రి, ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో టీడీపీ నాయకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘర్షణపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. భారీగా పోలీసు బలగాలు కొప్పర్రుకు చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉండటంతో పోలీసులు పికెంటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామం అంతటా పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ గుంపులుగా చేరనీయకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.