ఆంధ్రప్రదేశ్లో నెలవారీ వృద్ధాప్య పింఛను బకాయిల చెల్లింపులు ఇక మీదట ఉండవు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. నేడు జరిగే పింఛను పంపిణీ నుంచే ఈ విధానం అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ అక్రమంగా పింఛను పొందేవారికి చెక్ పెట్టేందుకే ఈ మేరకు మార్పులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ మూడు, నాలుగు నెలలకోసారి సొంతూళ్లకు వచ్చి అక్రమంగా పింఛన్లు తీసుకునే వారికి చెక్ పెట్టేందుకే ఈ విధానం తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా, లబ్ధిదారులు ఏ నెల పింఛను ఏ నెలకు.. ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టి ఒకేసారి పాత నెలల పింఛనును తీసుకునే విధానానికి స్వస్తి చెప్పింది. ఒకవేళ లబ్దిదారు గడచిన నెలల పింఛను తీసుకోని పక్షంలో ఆ మొత్తం మురిగిపోయినట్లే లెక్క. బకాయిలు ఇక మీదట చెల్లించరు. బుధవారం నుంచే ఈ కొత్త నిబంధనను అమలుచేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు.