కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఏపీలో కర్ఫ్యూ అమలవుతోన్న విషయం తెలిసిందే. అయితే కర్ఫ్యూ దృష్ట్యా రాష్ట్రంలో అత్యవసర ప్రయాణికులకు సోమవారం నుంచి ఈ-పాస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. విజయవాడలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. ప్రతి జిల్లా నుంచి మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 5 గంటలకు కర్ఫ్యూపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారని అన్నారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే వారి కోసం సోమవారం నుంచి ఈ–పాస్ విధానాన్ని సీఎం ఆదేశాలతో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే నేరుగా ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ ద్వారా తమ సమస్యను ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.
శుభకార్యాలకు సంబంధించి స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కోరారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 2 మాస్కులను ధరించాలని, శానిటైజర్ ను ఉపయోగించాలని అన్నారు. కరోనా నిబంధనలను, కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారి సమాచారాన్ని డయల్ 100, 112కి సమాచారం అందించాలని డీజీపీ కోరారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి వాహనాలను జప్తు చేస్తామన్నారు. ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.