ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో కరోనా కల్లోలంపై చలించిన యాపిల్‌

international |  Suryaa Desk  | Published : Tue, Apr 27, 2021, 06:03 PM

 భారత్‌లో కరోనా సృష్టిస్తున్న విలయంపై మరో టెక్‌ దిగ్గజం యాపిల్‌ స్పందించింది. కష్టకాలంలో ఉన్న భారతీయులను సాయమందించేందుకు ముందుకు వచ్చింది. క్షేత్ర స్థాయిలో మహమ్మారి నివారణకు జరుగుతున్న కార్యక్రమాలకు విరాళాల రూపంలో తమ వంతు సహకారం అందిస్తామని సంస్థ సీఈఓ టిమ్‌ కుక్‌ ప్రకటించారు.''భారతదేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో వైద్యులు, కార్మికులు, యాపిల్ కుటుంబం సహా భయంకరమైన ఈ మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరిపైనే మా ఆలోచనలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు మద్దతుగా యాపిల్ విరాళం ఇవ్వనుంది'' అని టిమ్‌ కుక్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. అయితే, ఏ రూపంలో, ఎంత మొత్తంలో సాయం చేయనున్నారనే దానిపై యాపిల్‌ నుంచి ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వానికే నేరుగా విరాళం అందించడంపై వివిధ వర్గాలతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.


అంతకుముందు భారత్‌లో కరోనా పరిస్థితులను చూసి భారత సంతతికి చెందిన టెక్‌ కంపెనీల సీఈఓలు తల్లడిల్లిపోయారు. మాతృదేశానికి చేయూతనందించేందుకు ముందుకు వచ్చారు. సహాయక చర్యల నిమిత్తం గూగుల్‌ తరఫున రూ.135 కోట్ల విరాళం అందిస్తున్నట్లు సంస్థ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. భారత్‌లో పరిస్థితులను చూసి తన గుండె బద్దలైందన్న మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల.. సహాయక చర్యలకు తోడ్పడేలా ఆక్సిజన్‌ కాన్సంట్రేషన్‌ యంత్రాల కొనుగోలుకు చేయూతనిస్తామని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com