యావత్ దేశాన్ని కదిలించింది రామతీర్థం రాములవారి విగ్రహాల ధ్వంసం ఘటన. విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో గుర్తుతెలియని దుండగులు విగ్రహాల ద్వంసానికి పాల్పడ్డారు. ఈఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏపీలోని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఈచర్యను తప్పుపట్టాయి. ప్రధానంగా ఏపీ బీజేపీ పార్టీ నేతలు ఓవైపు జనసేన నేతలు కూడా ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకొని ఘటనపై ఆరాతీశారు. ఓవైపు హైందవ సంఘాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డాయి.
దీంతో దిగివచ్చిన ఏపీ ప్రభుత్వం రామతీర్థంలో రాములవారి విగ్రహాలను ప్రతిష్టిస్తామని హామి ఇచ్చింది. వెంటనే దేవదాయశాఖ తిరుమలలోని ఎస్వీ కళాశాలలో కొదండరాముల వారి నూతన విగ్రహాలను సిద్ధం చేయించింది. నూతనంగా రూపుదిద్దుకున్న రాముల వారి విగ్రహాలు రామతీర్థానికి చేరుకున్నాయి. ఆలయ పూజారులు స్వామి విగ్రాహాలు తీసుకువచ్చిన వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామ లక్షణ సమేత ఆంజనేయ విగ్రహాలను రామతీర్థంలోని ధ్వజ స్థంభం పీఠం ఉంచారు.
రామతీర్థంలోని స్వామి వారి విగ్రహాలను ఈనెల 28న పున:ప్రతిష్టస్తామని దేవదాయశాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా జనవరి 25న అంకురార్పణ పూజలు నిర్వహిస్తామని, 26, 27 తేదీలలో ప్రాయశ్చిత హోమాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. పున:ప్రతిష్ట అనంతరం యథావిదిగా నిత్యపూజలు దేవాలయంలో కొనసాగుతాయని చెప్పారు