గుంటూరు : కరోనా వ్యాక్సిన్ వికటించి మరణించిన పెనుమాక గ్రామ ఆశా వర్కర్ విజయలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జిజిహెచ్) వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశా వర్కర్ బొక్కా విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అస్వస్థతకు గురి కాగా మూడు రోజుల క్రితం జిజిహెచ్లో చేర్పించారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న విజయలక్ష్మి ఆదివారం ఉదయం మృతిచెందింది. విజయలక్ష్మి మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో జిజిహెచ్ వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వం విజయలక్ష్మి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి, ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నేతాజీ, జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ధర్నాకు మద్దతు తెలిపారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సాయిప్రసాద్ కరోనా ప్రతికూల ప్రభావంతో చికిత్స పొందుతున్న ఆరోగ్య కార్యకర్తలను పరామర్శించారు.