ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఆ వ్యక్తిని సొంత కుటుంబ సభ్యులే దగ్గరకు రానివ్వరు! ఆఫీసులు, కంపెనీల్లో అయితే అడుగుకూడా పెట్టనివ్వరు. అయితే, మీకెందుకా చింత... మేం ఉండగా మీ చెంత అంటూ ఉత్తరప్రదేశ్ లోని ఓ ఆసుపత్రి ఏకంగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ల దందాకు తెరలేపింది. కరోనా ఉన్నాగానీ లేనట్టుగా సర్టిఫికెట్ ఇస్తామని ప్రకటించింది. మీరట్ లో ఉన్న ఆ ప్రైవేటు ఆసుపత్రి కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ కు రేటు ఫిక్స్ చేసింది. రూ.2,500 చెల్లిస్తే కరోనా లేదంటూ డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తామని ప్రచారం షురూ చేసింది.
ఓ వీడియోలో సదరు ఆసుపత్రి సిబ్బంది డబ్బులిస్తే కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఇస్తామంటూ చెబుతున్న విషయం వైరల్ గా మారడంతో పోలీసులు స్పందించారు. ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అటు, ఆసుపత్రి మూసివేయడంతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేశారు. అయితే, ఆసుపత్రి అధినేత షా ఆలమ్ మాత్రం తమ ఆసుపత్రికి అవినీతి అంటకడుతున్నారని, తన పేరుప్రతిష్ఠలు దెబ్బతీసేందుకే ఈ వీడియోను కావాలనే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.