కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అప్పు చేసి ఆర్థిక సమస్యల్ని పరిష్కరించాలనుకుంటున్నారా? మీ బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ముత్తూట్ ఫైనాన్స్ 'లోన్ ఎట్ హోమ్' సర్వీస్ను ప్రారంభించింది. కస్టమర్ల ఇంటికి వెళ్లి మరీ అప్పులు ఇవ్వాలని ముత్తూట్ ఫైనాన్స్ నిర్ణయించింది. కస్టమర్లు బ్రాంచ్కు రావాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి దగ్గరే లోన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఇప్పటికీ పలు ఆంక్షలున్నాయి. ప్రజల్లో ఇప్పటికీ భయాందోళనలు ఉన్నాయి. అందుకే కస్టమర్ల ఇంటికి వెళ్లి సేవలు అందిస్తామంటోంది ముత్తూట్ ఫైనాన్స్. కస్టమర్లు 'లోన్ ఎట్ హోమ్' సర్వీస్ ఉపయోగించుకొని ఇంటి దగ్గరే లోన్ తీసుకోవచ్చు.గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లు ముత్తూట్ ఫైనాన్స్ యాప్ లేదా వెబ్సైట్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఆ తర్వాత కస్టమర్లు కోరుకున్న రోజున చెప్పిన సమయానికి ముత్తూట్ ఫైనాన్స్ ప్రతినిధులు ఇంటికి వస్తారు. కస్టమర్ల సమక్షంలోనే బంగారు నగలను చెక్ చేస్తారు. ఆ బంగారానికి ఎంత వరకు లోన్ తీసుకోవచ్చో, నియమనిబంధనలేంటో వివరిస్తారు. డాక్యుమెంటేషన్తో ఏదైనా ఉంటే అక్కడే పూర్తి చేస్తారు. అక్కడికక్కడే కస్టమర్లకు లోన్ మంజూరు చేస్తారు. కస్టమర్ల అకౌంట్లోకి లోన్ వెంటనే క్రెడిట్ అవుతుంది.