సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై క్రమశిక్షణా చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆ పార్టీ ఎంపీల బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది.ఎంపీల బృందంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి, ఎంపీలు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్ తదితరులు ఉన్నారు. రఘురామకృష్ణంరాజుకు ఇప్పటికే పార్టీ నుంచి షోకాజు నోటీసు అందిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ ఫిర్యాదుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.