ప్రముఖ జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కాంట్రాక్ట్ ఒప్పందంలో జీవీకే గ్రూప్ అవినీతికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. దీంతో 310 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంది.జీవీకే గ్రూప్ ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేసేందుకు మియాల్ రిజర్వు ఫండ్ రూ.395 కోట్లను దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపణలు చేసింది. జీవీకే గ్రూప్ ఛైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, అతని కుమారుడు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ సంజయ్ రెడ్డితోపాటు మియాల్, జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, మరో 9 ప్రైవేటు కంపెనీలు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.