ఏపీలో రెండు మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయన్న చర్చ జోరుగా సాగుతుంది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్,మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడా స్థానంలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయన్న చర్చ మొదలైంది. బీసీ వర్గానికి చెందిన మోపిదేవి స్థానంలో గుంటూరు జిల్లా నుంచి విడదల రజిని రేసులో ఉన్నారు. ఈమెకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడంతో సీఎం జగన్ ఈమెను మంత్రి పదవికి ఎంపిక చేస్తారని కార్యకర్తలు ఆశిస్తున్నారు. ఇదే జిల్లా నుంచి బీసీ కాకపోయినా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా రేసులో ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్ తో పాటు మరికొందరు రేసులో ఉన్నారు. సీఎం జగన్ ఒక వేళ సామాజిక వర్గం,జిల్లాలు పట్టించుకోకపోతే అనేక మంది రేసులో ఉండే అవకాశం ఉంది. సీనియర్లు మంత్రి పదవులకు సంబంధించి ఇప్పటికే లాబీయింగ్ చేస్తునట్టు సమాచారం. మంత్రి పదవి రేసులో రోజా,ఉమ్మారెడ్డి,ధర్మాన ప్రసాదరావు,పార్దసారధి,జోగి రమేష్ లు కూడా ఉన్నారని తెలుస్తోంది. సీఎం జగన్ మరీ వీరిలో ఎవరికి అవకాశాన్ని ఇస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. జూలై 21న శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. జూలై 22న కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉందని సమాచారం.