మద్యానికి బానిసలైన వారు ఒక్కసారి ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే మద్యం మానేస్తారట. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది.. ఇక్కడి స్వామి వారి విశేషాలేంటి అనేవి మనం ఇపుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవిగా, ‘వికటకవి’గా ఖ్యాతికెక్కిన తెనాలి రామకృషుడు పాండురంగ భక్తుడు. ఈయన పాండురంగ మహాత్మ్యము గురించి కావ్యాలను వ్రాసాడు. రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో కొలువైన పాండురంగ స్వామి దేవాలయం ఉంది.ఉంతకల్లులో కొలువైన పాండురంగ దేవాలయం ఎంతో మహిమకలది. గ్రామస్తులందరూ భక్తి శ్రద్దలతో పూజా కార్యాక్రమాలను నిర్వహిస్తుంటారు. కొన్ని శతాబ్దాల క్రితం ఈ ఊరు ప్రజలు తరచూ మహారాష్ట్ లోని పుణ్యక్షేత్రమైన ‘పండరీపురం’ వెళ్లివచ్చేవారు. ఆ తర్వాత ఇక్కడే పాండురంగ స్వామి దేవాలయాన్ని నిర్మించుకున్నారు. మద్యానికి బానిసైనవారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి పాండురంగ మాల ధరిస్తే మళ్ళీ జన్మలో దాని జోలికి పోరనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. మాలాధారణ నిర్వహణ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే. ‘శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి’ రోజుల్లోనే మాల ధరించాలి.ఆ రోజులలో రాష్ట్రం నలుమూలల నుంచే కాక పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో హాజరవుతుంటారు. పాండురంగ మాల ధరించాలనుకొనేవారు ముందురోజు అర్ధరాత్రి నుంచి మాలను స్వామి వారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు చేస్తారు. మాలధారణ చేసిన వారు వరుసగా మూడు ఏకాదశ రోజులలో ఇక్కడికి వచ్చి ఆలయ ప్రాంగణంలో నిద్రపోవాలి. కావాలనుంటే ఆ మూడు ఏకాదశ రోజులు అయిపోయినాక మాల తీసేయవచ్చు.