ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు సేవ చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కడుపు మండిపోతోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పేదలకు మేలు చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటే దేవుడు కూడా క్షమించడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి చంద్రబాబు దించారని ఆరోపించారు. కరోనాపై చంద్రబాబు నిజాలు మాట్లాడాలన్న ఆయన నిన్న ఒక్కరోజే 30 వేల పరీక్షలు చేశారని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 9 లక్షల కరోనా పరీక్షలు చేశారని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయనన్ని కరోనా పరీక్షలు రాష్ట్రంలో చేస్తున్నారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామిక ప్రోత్సాహకాలను చంద్రబాబు ఎగ్గొట్టారని పారిశ్రామిక రంగానికే కాదు అన్ని రంగాలకు ప్రోత్సాహకాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. రూ. 2.75 లక్షల కోట్ల అప్పుల కుప్పలోకి రాష్ట్రానికి చంద్రబాబు దించారని వేల కోట్ల రూపాయల బకాయిలు చంద్రబాబు పెట్టారని ఆరోపించారు. భూములు ఇచ్చిన తర్వాత పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే భూములు వెనక్కి తీసుకోకపోతే ఏమి చేస్తారని ప్రశ్నించారు.