ఆ ఆలయంపై ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపైనే పడుతుంది. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్లీ పూర్వరూపంలో ప్రత్యక్షమవుతుంది. ఇది వినేందుకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీరు మరింత అద్భుతంగా ఫీలవుతారు. ఎత్తైన హిమగిరుల్లో.. ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక్కసారి అడుగుపెడితే చాలు. మనసు ఎంతో తేలిగ్గా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్కు వెళ్తే తప్పకుండా కులు-మనాలిని సందర్శించండి. ముఖ్యంగా కులుకు 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘బిజిలీ మహాదేవ్’ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. అయితే, ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు కిలో మీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ట్రెక్కింగ్ మీకు అస్సలు బోరు కొట్టదు. చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూస్తూ నడిస్తే అలసటే అనిపించదు. ‘బిజిలీ మహాదేవ్’ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు.ఈ ఆలయంలో ఏడాదికి ఒకసారైన పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా శివలింగం పైనే పడుతుంది. ఫలితంగా శివలింగం ముక్కలవుతుంది. దీంతో ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒకచోటకు చేర్చి తృణధాన్యాలు, పిండి, వెన్నతో లింగంగా మార్చుతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్లీ పూర్వ రూపంలోకి మారిపోతుంది. పగుళ్లు కూడా కనిపించకుండా పూర్తిస్థాయి శివలింగంలా దర్శనమిస్తుంది. ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురికావడం వల్ల ఈ ఆలయానికి ‘బిజిలీ మహాదేవ్’ అని పేరు వచ్చింది. హిందీలో బిజీలీ అంటే విద్యుత్ లేదా పిడుగు. ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను, జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగుపాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం. విరిగిన శివలింగం మళ్లీ పూర్వ స్థితికి మారడానికి గల కారణం తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. సాధారణంగా పిడుగు పడితే రాయి చెల్లా చెదురవుతుంది. జిగురుతో అతికించినా అది పూర్తిస్థాయిలో అంటుకోదు. అలాంటి పూజర్లు పిండి, తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుందనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే.