సుప్రసిద్ధ తెలుగు రచయితల్లో ఒకరైన తాపీ ధర్మారావు అసలుపేరు బండారు ధర్మారావు నాయుడు. ఆయన 1887 సంవత్సరం సెప్టెంబర్ 19న బరంపూర్ లో జన్మించారు. ఆయన కేవలం రచయిత మాత్రమే కాదు తెలుగు భాషా పండితుడు, జాతీయవాద భావాలున్న వ్యక్తి. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం. ధర్మారావు నాయుడు 1910లో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించారు. ఆయన తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఆయన నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఆయన ప్రతిభకు నిదర్శనాలు.బొబ్బిలి రాజా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ధర్మారావు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు. ఆయనను గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు. ఆంధ్రులకొక మనవి, పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు, మబ్బుతెరలు, భావప్రకాశిక, ఆంధ్ర తేజము మొదలైనవి ఆయన రచనల్లో పేరెన్నికగన్నాయి. ఆయనను 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదుతో సత్కరించారు. 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము వరించింది. ఆయన జయంతిని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నారు. తాపీ ధర్మారావు 1973 మే 8న తుదిశ్వాస విడిచారు.