ఏపీ కేబినేట్ లో పలు కీలక విషయాలతో పాటు రెండు కొత్త పథకాల పై చర్చించారు. చిరు వ్యాపారులు,తోపుడు బండ్ల పై వివిధ వస్తువులు అమ్ముకునే వారికి,హస్తకళల మీద ఆధార పడి జీవించే వారికి సంవత్సరానికి రూ.10 వేల చొప్పున బ్యాంకుల ద్వారా రుణాలను సర్కార్ ఇప్పించనుంది. ఈ రుణాలకు వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. రుణం తీసుకున్న వారు అసలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకాన్ని అక్టోబర్ లో ప్రారంభించాలని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.అదే విధంగా వైఎస్సార్ చేయూత కింద 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.75వేల ఆర్థికసాయం చేయనున్నారు. దీనిని ఆగష్టు 12న ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. అర్హులైన మహిళలకు సంవత్సరానికి రూ.18,142చొప్పున నాలుగేళ్ల పాటు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు. ఈ రెండు పథకాలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.