ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హనీ ట్రాప్ ఉదంతంలో 15కు చేరిన అరెస్టుల సంఖ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 12:19 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాకిస్తాన్ యువతుల హనీ ట్రాప్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. విశాఖపట్నం గూఢచర్యం కేసులో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన మరో కుట్రదారుడు షేక్‌ అబ్దుల్ రెహమాన్ జబ్బార్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో అబ్దుల్‌ రెహమాన్‌ భార్య షయిత్సా కాజిర్‌ను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. విశాఖ నౌకాదళం కేంద్రంగా సాగిన హనీట్రాప్ వ్యవహారం గతేడాది డిసెంబర్ 20న బట్టబయలైన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ అమ్మాయిల పేర్లతో విశాఖ నేవీ దళ సభ్యులకు ఎరవేసి దేశ రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు కుట్ర పన్నారు.ఈ కుట్రను పసిగట్టిన ఎన్‌ఐఏ ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరుతో లోతుగా దర్యాప్తు చేపట్టింది. విచారణలో భాగంగా గతేడాది డిసెంబర్ 29న విజయవాడ పోలీస్ స్టేషన్‌లో ఐసీపీ సెక్షన్ 120 బి, 121ఎ, యుపీ (ఏ) చట్టం సెక్షన్ 17, 18, అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్ 3 కింద అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ నెలలోనే 11 మంది నేవీ అధికారులు సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరొక సూత్రధారి అరెస్ట్ చేసి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ద్వారానే నేవీ అధికారులకు డబ్బులు అందినట్లు ఎన్‌ఐఏ నిర్దారణ చేసింది. తాజా అరెస్టుతో ఇప్పటివరకు మొత్తం 15 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com