గ్యాంగ్వార్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సందీప్ అనుచరుల ద్వారా కీలక సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. గొడవ జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. అయితే గ్యాంగ్వార్లో ఎంత మంది పాల్గొన్నారనేదానిపై పోలీసులు స్పష్టతకొచ్చారు. పలు కోణాల్లో కేసు విచారణను పోలీసులు చేపడున్నారు. కీలక ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. గ్యాంగ్వార్లో పాల్గొన్నవారి సెల్ఫోన్ డేటాను పోలీసులు సేకరించారు. మాజీ రౌడీషీటర్ లారా బావమరిది, మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు.. గ్యాంగ్వార్లో కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మూడేళ్ల క్రితం ఒక దాడిలో ప్రాణాలు కోల్పోయిన రౌడీషీటర్ హేమంత్ సోదరుడు కిరణ్ పాత్రపై పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు శివ, కిరణ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
బెజవాడ నడిబొడ్డున పటమటలో ఆదివారం పట్టపగలు.. గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. రెండు వర్గాలకు చెందిన పదుల సంఖ్యలో యువకులు కత్తులు, రాడ్లు, సీసాలతో దాడి చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ఇద్దరు భాగస్వాముల మధ్య చోటు చేసుకున్న వివాదంలో తలదూర్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన ‘గ్యాంగ్ వార్’ తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దాడుల్లో గ్యాంగ్ లీడర్ సందీప్ ప్రాణాలు కోల్పోగా మరో గ్యాంగ్ లీటర్ పండు తీవ్రంగా గాయపడ్డాడు. సందీప్ ఏడాదిన్నర క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడని సమాచారం. అతడికి చిన్నపాప ఉంది. సందీప్పై పటమట స్టేషన్లో 13 కేసులున్నాయి. రౌడీషీట్ను ఇటీవలే మూసివేశారని సమాచారం. పండుపై పెనమలూరు పోలీస్స్టేషన్లో సుమారుగా 13 కేసులు ఉన్నట్టు సమాచారం. అతడిని తల్లే ప్రతి కేసు నుంచీ బయటకు తీసుకొచ్చేదని చెబుతున్నారు. కాగా, ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటి వరకు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ గ్యాంగ్వార్లో ఉన్న ప్రతి ఒక్కరిపైనా రౌడీషీట్ తెరుస్తామని పోలీసులు చెబుతున్నారు.