లాక్ డౌన్ వేళ కరోనాను అరికట్టడానికి ఎక్కువగా పోరాడుతోంది ఆస్పత్రి సిబ్బందే. కుటుంబాలకు దూరంగా ఉంటూ కరోనాకు దగ్గరగా ఉండి అందరినీ కాపాడుతున్నారు. మరి అటువంటి ఆస్పత్రి సిబ్బంది నేడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మంగళవారం ముంబైలోని కేఈఎమ్ హాస్పిటల్లో మెడికల్ స్టాఫ్ ఆందోళనకు దిగారు. పీపీఈ కిట్లు, మాస్కులు వేసుకుని అందరూ బయటకు వచ్చి ఆందోళన చేశారు. కరోనా వార్డులో పనిచేస్తున్న ఒక వ్యక్తి చనిపోయినందుకు నిరసన తెలిపారు. నాలుగు రోజులుగా ఆస్పత్రిలో పనిచేస్తున్న వ్యక్తి అనారోగ్యంతో ఉండటం వల్ల సెలవు మంజూరు చేయాలని అడిగారు. ఆ వ్యక్తికి ఆరోగ్యం సరిగా లేదని, సెలవు అడిగినా ఆస్పత్రి యాజమాన్యం సెలవు ఇవ్వలేదని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని, పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని వారు ఆరోపించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేఈఎమ్ హాస్పిటల్ను కరోనా పేషంట్ల ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే చనిపోయిన వ్యక్తికి కరోనా ఉందా అనే విషయం తెలియాల్సి ఉందని, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని అధికారులు తెలిపారు.