ఆరేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను లాక్కెళ్లి ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. అత్యాచారం చేయడంతో పాటు బాలిక కళ్లను పొడిచి.. శరీరమంతా గాయపడేలా చేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, దామో జిల్లాలోని బన్సిపురా గ్రామంలో ఓ ఆరు సంవత్సరాల బాలిక బుధవారం సాయంత్రం పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఓ పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమె చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి దారుణంగా అత్యాచారం చేశారు. అనంతరం ఆమె రెండు కండ్లను పొడిచినట్టుగా తెలుస్తోంది.అయితే బాలిక కుటుంబ సభ్యులకు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా గురువారం ఉదయం బాలిక ఇంటికి సమీపంలోని ఓ పాడుబడిన ఇంట్లో అపాస్మరక స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు. అప్పటికే బాలిక శరీరమంతా తీవ్ర గాయాలతో ఉంది. పరిస్థితి విషమంగా ఉండడంతో జబల్పూరులోని ఆస్పత్రికి తరలించారు. ఇంతటి దారుణ చర్యకు పాల్పడిన నిందితుల సమాచారం అందించిన వారికి రూ.10వేల నగదును బహుమతిగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు.