వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ తల్లి ఏకంగా తన కొడుకునే హత్య చేసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా పరిధిలోని దాద్రీ దగ్గర లుహార్లీ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో సతీష్ కుమార్,దేవి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి అన్షుల్, దీప అనే పిల్లలున్నారు. దీపకు వివాహం జరిపించారు. దేవికి బదలాపూర్ గ్రామానికి చెందిన మాంత్రికుడు కన్నయ్యతో పరిచయం ఏర్పడింది. దేవికి 40 సంవత్సరాలు ఉంటాయి. కన్నయ్యకు 70 సంవత్సరాలు. వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఓ రోజు భర్త,కొడుకు ఇంట్లో లేని సమయంలో దేవి కన్నయ్యను ఇంటికి పిలిపించుకొని రాసలీలల్లో మునిగింది. ఇదే సమయంలో అన్షుల్ ఇంటికి వచ్చాడు. వీరిద్దరు ఏకాంతంగా ఉండడాన్ని చూసి షాకయ్యాడు. తండ్రికి చెబుతానని హెచ్చరించి పద్దతి మార్చుకోవాలన్నాడు. దీంతో అన్షుల్ పై దేవి కక్ష పెంచుకుంది. అతనిని చంపాలనుకుంది. ఇందుకోసం తన అల్లుడి సాయం తీసుకుంది. అన్షుల్ ను చంపేందుకు తనతో కలిసి ప్లాన్ వేసింది. అతను సచిన్,సత్యేంద్ర,అమిత్ అనే యువకులతో కలిసి అన్షుల్ ను చంపేందుకు ప్లాన్ వేశాడు. దీనికి సంబంధించి రూ.36 వేలకు బేరం కుదుర్చుకున్నారు. మార్చి 18న దేవి అల్లుడు అన్షుల్ ను తీసుకొని యువకులతో కలిసి వెళ్లాడు. అక్కడ మద్యంలో విషం కలిపి అతనికి తాపించారు. అనంతరం అతని గొంతు నులిమి చంపేశారు. దాద్రి పరిధిలోని కోట్ కెనాల్ బ్రిడ్జి వద్ద అన్షుల్ మృతదేహాన్ని పడేసి వెళ్లారు. అనంతరం పోలీసులు స్థానికుల ద్వారా విషయం తెలుసుకొని అన్షుల్ చిరునామా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే అన్షుల్ అంత్యక్రియలు త్వరగా పూర్తి చేయాలని దేవి పోలీసులను తొందర పెట్టింది. దీంతో వారికి అనుమానం పెరిగింది. అన్షుల్ అంత్యక్రియల తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించగా విచారణలో నిజాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.