కరోనా వైరస్ నియంత్రణకు విధించిన 21 రోజుల లాక్డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మరోసారి వీడియో సందేశం ఇచ్చారు. 130 కోట్ల మంది ప్రజలు ఈ సమయాన్ని తనకు ఇవ్వాలంటూ మోదీ వీడియో సందేశంలో కోరారు. కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులంతా శక్తి సామర్ధ్యాలను చాటారని కితాబిచ్చారు. దేశమంతా ఏకమైన కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొడతారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం మన మార్గంలోనే నడుస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటేనే కరోనాను జయించగలమని అన్నారు. తాము ఒక్కరమే ఇంట్లో ఉంటే వైరస్ను ఎలా నియంత్రించగలమని అనుకోవద్దని ప్రధాని పేర్కొన్నారు
ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లో లైట్లు ఆపేసి, మొబైల్ టార్చ్ కూడా ఆన్ చేయవద్దని, తలుపులు మూసేసి గుమ్మం ముందు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని సూచించారు. దేశ ప్రజలంతా బాల్కనీలోకి వచ్చి కొవ్వెత్తులు, ప్రమిదలతో దివ్వెలను వెలిగించి, కరోనాను తిప్పికొడతామని సంకల్పం తీసుకోవాలని మోదీ ఉద్ఘాటించారు. ఈ సంకట సమయంలో భారతీయులకు ఇది శక్తి, ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. సంకల్పాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేదని.. అందరూ కలిసి వచ్చి.. కరోనాను ఎదుర్కొండని కోరారు. కరోనా పై యుద్ధంలో అందరూ సహకరించాలని ప్రధాని మోదీ మరోసారి అభ్యర్థించారు.
లైట్లు ఆపేసి వీధుల్లోకి రాకుండా, గుమ్మం ముందు నిలబడి, వీలైనన్ని ఎక్కువ దీపాలను, కవ్వోత్తులను వెలిగించాలని మోదీ కోరారు. సెల్ ఫోన్లలోని ఫ్లాష్ లైట్లను, టార్చి లైట్లను వెలిగించాలని, ఈ సమయంలో వీధుల్లోకి మాత్రం ఎవరూ రావద్దని ఆయన కోరారు. తద్వారా జాతి సంకల్పం ఒకటేనన్న సందేశాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో అమలు అవుతున్న లాక్డౌన్ను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను గమనిస్తోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 130 కోట్ల మంది ఒకే పని చేస్తే, ప్రపంచానికి ఓ సంకేతం వెళుతుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 9న జ్యోతులు వెలిగించి, మన సంకల్పాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.