కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. దేశాలమధ్య రాకపోకలు కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానాన్ని పంపి తమను ఆదుకోవాలని లండన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. కరోనా వైరన్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత్ నిషేధించడంతో వీరంతా స్వదేశానికి రాలేకపోయారు. ప్రస్తుతం అక్కడున్న 380 మంది విద్యార్థులు భారత ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం తమ పాస్ పోర్టు ఇతర వివరాలతో కూడిన జాబితాను రూపొందించడం పారంభించారు. అపార్ట్మెంట్లు, వసతిగృహాలకు పరిమితమైన విద్యార్ధులు కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వస్తున్నారు. మరోవైపు, సూపర్మార్కెట్లకు వెళ్లిన విద్యార్ధులకు అక్కడ అన్నీ ఖాళీ అరలే దర్శనమిస్తున్నాయి. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇలా ఏ ఒక్కటీ దొరకడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్టున్నారు.