ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెలా చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడే కార్యక్రమం మన్ కీ బాత్ లో ఈ రోజు కరోనా గురించి, లాక్డౌన్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తప్పని పరిస్థితుల్లోనే దేశంలో లాక్డౌన్ విధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అందుకు తనని క్షమించాలని వేడుకున్నారు. ముఖ్యంగా దినసరి కూలీలు పడుతున్న బాధల్ని తాను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. ప్రజలు తమని తాము రక్షించుకుంటూ, తమ కుటుంబాల్ని కూడా కాపాడుకోవడానికే లాక్డౌన్ విధించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయతాండవం నేపథ్యంలోనే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.