ఈ మధ్య బాలకృష్ణ-బోయిపాటి కాంబినేషన్లో వస్తున్న హేట్రిక్ చిత్రంలో విలన్గా అవకాశం కొట్టేసిన వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా బాలయ్యపై తన ప్రేమానురాగాలను తెగ కురిపించేస్తోందని ఇండస్ట్రీతో పాటు రాజకీయ పక్షాలలోనూ టాక్ వినిపిస్తోంది. బుధవారం ఇదే అంశం అసెంబ్లీ మీడియా పాయింట్లోనూ ఆమె మాటల్లో వ్యక్తమైందన్నది పలువురి మాట.
టిడిపి అధినేత చంద్రబాబు స్వయానా తన బావమరిది, వియ్యంకుడు, నటుడు అయిన నందమూరి బాలకృష్ణకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తున్నారని రోజా ఆరోపించారు. ఆమె కామెంట్ టిడిపి ఎమ్మెల్యేలు ఉలిక్కిపడేలా చేసినా, అసలు చంద్రబాబు మాట్లాడుతుంటేనే వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు వణిపోతున్నారని, నోటికొచ్చిన బూతులతో సభని నడిపిస్తున్నారని టిడిపి వర్గాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు కళాకారులకు తీరని అన్యాయం చేస్తున్నారని చెపుతున్న రోజాకు రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. కళాకారులను ఆదుకోవటంలోనూ, వారికి అవకాశాలు కల్పించడంలోనూ తెలుగుదేశం పార్టీ ముందుంటుందని, ఆ క్రమంలోనే రోజా తెలుగుమహిళ అధ్యక్షురాలిగా కూడా నియమించిన విషయం గుర్తు చేస్తున్నారు.
ఇక హిందూపూర్ నుంచి శాసనసభ కు ఎన్నికైన నటుడు నందమూరి బాలకృష్ణకు సభలో మాట్లాడే అవకాశం చంద్రబాబు ఇవ్వడం లేదని రోజా ఆరోపణలు తోసిపుచ్చుతూ, వివిధ అంశాలపై బాలకృష్ణకు మంత్రులు జాబు రూపంలోనే సమాధానాలను పంపుతున్నారని, తన సినిమా అవకాశం నిలుపుకునేందుకే రోజా ఇష్టానుసారంగా మాట్లాడుతోందన్నది వారి ఆరోపణ. మరి ఈ విషయంలో రోజా ఎలా స్పందిస్తుందో చూడాలి.