ఏపీ రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 12న కాకినాడలో నిరాహారదీక్ష చేపడతానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలబడేందుకు పవన్ కల్యాణ్ చేపట్టనున్న దీక్షకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు. పవన్ కల్యాణ్ దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు. రైతులకు బాసటగా నిలించేందుకు ఒక రోజు దీక్ష చేయాలని పవన్ నిర్ణయించారని అన్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడలో నిరసన దీక్ష చేయనున్నట్టు తెలిపారు. అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించడంతో ఉభయ గోదావరి జిల్లాల రైతులు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.