సీఎం జగన్ అధికారిక నివాసానికి కేటాయించిన నిధులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. తాడేపల్లితో పాటు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసానికి సెక్యూరిటీ కోసం కేటాయించిన నిధుల జీవో లు రద్దు చేసింది ఏపీ సర్కార్. తాడేపల్లి నివాసానికి ఫర్నిచర్ కొనుగోలు, విద్యుత్ సౌకర్యం, ఇతర వసతుల కోసం కేటాయించిన నిధులు నిలిపివేసింది. సుమారు రూ. 3కోట్ల విలువైన పనులకు సంబందించిన కేటాయింపులు రద్దు చేసింది. సీఎం నివాసానికి ఏర్పాట్ల కోసం ప్రభుత్వమే నిధులు భరించాల్సి ఉన్నప్పటికీ ... జగన్ వద్దని వాటిని నిలుపుదల చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రద్దుకు సంబంధించి 6 జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. అధికారిక నివాసానికి నిధుల కేటాయింపుపై గతంలో ప్రతిపక్షాల విమర్శలు గుప్పించాయి. అయితే వారికి ధీటుగా సమాధానం ఇచ్చేలా జగన్ తన ఇంటికి కేటాయించిన నిధుల్ని రద్దు చేశారు.
కొన్నిరోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ లోటస్పాండ్లో ఉన్న నివాసంలో కొన్ని ఎలక్ట్రికల్, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ.35.50లక్షలు విడుదల చేయడానికి పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు సూచనలు చేసింది.