ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత మాజీ కెప్టెన్, హెచ్సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ పేరిట ఒక స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ పెవిలియన్కు అజరుద్దీన్ పేరు పెట్టేందుకు అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ తీర్మానం చేసింది. వచ్చే నెల 6న భారత్-వెస్టిండీస్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్ సమయంలో అధికారికంగా స్టాండ్కు పేరు పెడతామని హెచ్సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ తెలిపారు. తొలి టీ20 మ్యాచ్కు ముందు 'అజరుద్దీన్ స్టాండ్' కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు హెచ్సీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హాజరుకానున్నారు. గంగూలీతో పాటు బీసీసీఐ బోర్డు ఇతర పెద్దలు, మాజీ క్రికెటర్లు కూడా హాజరవుతారని సమాచారం తెలుస్తోంది. అజరుద్దీన్ భారత క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపుగా స్టాండ్ను ఏర్పాటు చేస్తున్నారు. భారత్కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రికెటర్లు అర్షద్ అయూబ్, వెంకటపతిరాజులను భవిష్యత్తుల్లో ఇదే తరహాలో గౌరవిస్తామని కూడా హెచ్సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ చెప్పారు. మరో వైపు సౌత్ పెవిలియన్ బ్లాక్లోని ఒక లాంజ్కు హెచ్సీఏ మాజీ సంయుక్త కార్యదర్శి ఆర్.దయానంద్ పేరు పెట్టనున్నారు. భారత్-విండీస్ టీ20 మ్యాచ్ కోసం శుక్రవారం నుంచి టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రేక్షకులు టిక్కెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. ఈవెంట్స్ నౌ వెబ్సైట్తో పాటు జింఖానా మైదానంలో టిక్కెట్లు విక్రయిస్తామని హెచ్సీఏ అధికారులు తెలిపారు. రూ.800 నుంచి 12,500 వరకు టిక్కెట్ల ధరలు ఉన్నాయి. టిక్కెట్ల ధరలను రూ.800, రూ.1000, రూ.1500, రూ.4000, రూ.5000, రూ.7500, రూ.10000, రూ.12500గా నిర్ణయించారు. హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్ అంబటి రాయుడు వ్యవహారంపై తొలి టీ20 మ్యాచ్ ముగిశాక స్పందిస్తా అని అజహరుద్దీన్ తెలిపారు. తొలి టీ20 నిర్వహణకు సమయం తక్కువ ఉన్నందున ప్రస్తుతం ఆ ఏర్పాట్లపైనే పూర్తిగా దృష్టి పెట్టా. ఈ నెల 6 తర్వాత హెచ్సీఏ ఏజీఎం నిర్వహించి అవినీతి ఆరోపణలపై చర్చించి.. మీడియాకు వివరాలు తెలియజేస్తామని అని చెప్పాడు.