ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజీనామా యోచనలో అశోక్ రెడ్డి..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 06:56 PM

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అశోక్ రెడ్డి చేరికకు సీఎం జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.  ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. వారు చేరేలోగా అశోక్ రెడ్డి చేరే అవకాశం ఉందని సమాచారం. ఇకపోతే అశోక్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
2014 ఎన్నికల్లో అశోక్ రెడ్డి వైసీపీ తరుపున గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆనాటి టీడీపీ అభ్యర్థి అన్నా రాంబాబుపై 12 వేల మెజారిటీతో విజయం సాధించారు. అయితే వైసీపీ ప్రతిపక్ష పార్టీకే పరిమితం కావడంతో ఆయన పార్టీ ఫిరాయించారు.  వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో జాయిన్ అయిపోయారు. నియోజకవర్గ అభివృద్ధిపేరుతో చంంద్రబాబు గూటికి చేరిపోయారు. అశోక్ రెడ్డి చేరికతో టీడీపీలో ఉన్న అన్నా రాంబాబు వైసీపీలో చేరిపోయారు.  2019 ఎన్నికలకు వచ్చేసరికి పోటీ కాస్త రివర్స్ అయ్యింది. అన్నా రాంబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తే అశోక్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అన్నా రాంబాబు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అన్నా రాంబాబు ఏకంగా 81వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ సాధించిన వారిలో అన్నా రాంబాబు ఒకరు. వైసీపీ అధికారంలోకి రావడంతోపాటు నియోజకవర్గంలో వైసీపీ వేవ్ నడుస్తుండటంతో అశోక్ రెడ్డి రాజకీయ భవిష్యత్ పై పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.  వైసీపీలో చేరితే రాజకీయ భవిష్యత్ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి భావిస్తున్నారట. అందువల్లే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు టీడీపీ కార్యక్రమాలకు అందనంత దూరంలోనే ఉంటున్నారట అశోక్ రెడ్డి.  వైసీపీలో చేరాలనే ఉద్దేశంతోనే టీడీపీకి దూరంగా ఉంటున్నారంటూ ప్రకాశం జిల్లాలో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలను సైతం అశోక్ రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది.
ఇకపోతే అశోక్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయని టాక్. అశోక్ రెడ్డి వైసీపీలో చేరక ముందు నుంచే జగన్ తో మంచి స్నేహం ఉందని ప్రచారం. అందువల్లే 2014లో టికెట్ ఇచ్చారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పరిచయం నేపథ్యంలోనే వైసీపీలో చేరే అంశంపై సీఎం జగన్ కు మాజీ ఎమ్మెల్యే అశోక్ రాయబారం పంపినట్లు తెలుస్తోంది. అందుకు జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
గిద్దలూరు ఎమ్మెల్యేగా అన్నా రాంబాబుకు ఉన్న నేపథ్యంలో వారి మధ్య ఎలాంటి రాజకీయ విబేధాలు తలెత్తకుండా చూడాలని జిల్లా నేతలను సీఎం జగన్ ఆదేశించారట. ఇద్దరూ కలిసి పనిచేస్తామని ఒక నిర్ణయానికి వస్తే అశోక్ రెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com