దేశ రాజధానిని ప్రస్తుతం ప్రధానంగా పట్టిపీడిస్తోన్న సమస్యం వాయు కాలుష్యం. ఢిల్లీలో మాస్కులు లేనిదే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం అంశంపై పార్లమెంట్ ప్యానెల్ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ చర్యలపై చర్చించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం అవుతుందని, దీనికి హాజరు కావాలంటూ వారం రోజుల క్రితమే తూర్పు ఢిల్లీ లోక్సభ ఎంపీ గౌతమ్ గంభీర్కు అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశానికి గౌతమ్ గంభీర్ డుమ్మా కొట్టాడు. మొత్తం 29 మంది ఎంపీలకుగానూ కేవలం నలుగురు మాత్రమే హాజరు కావటంతో సమావేశాన్ని రద్దు చేశారు. ఈ ఘటనపై పార్లమెంట్ ప్యానెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సమావేశానికి గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటామని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. కీలక సమావేశానికి గౌతమ్ డుమ్మా కొట్టడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్లో తీవ్ర విమర్శలు గుప్పించింది. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి గంభీర్ జిలేబీ తింటున్న ఫొటోను జత చేసి "ముందు మీరు ఎంజాయ్ చేయడం ఆపి వాయు కాలుష్యంపై జరిగే సమావేశాల్లో హాజరవండి" కామెంట్ పెట్టింది. అంతేకాదు కాలుష్య నివారణ చర్యలపై గంభీర్కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని #ShameOnGautamGambhir ట్యాగ్తో ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఇండోర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు కామెంటేటర్గా వ్యవహారిస్తున్నాడు. దీంతో నెటిజన్లు గౌతమ్ తీరును తప్పుపడుతున్నారు. "ప్రజలు నిన్ను గెలిపించినందుకు నువ్వు తగిన శాస్తి చేస్తున్నావు" అని ఓ నెజిటన్ కామెంట్ పెట్టగా... మరొక నెటిజన్ "ఇక్కడ ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోతుంటే నువ్వు ఇండోర్లో జిలేబీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావా?" ట్వీట్ చేశాడు.