టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వంశీ టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియని వాళ్లు పార్టీని నడిపితే.. అందులో ఉండాలా? అని ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిపై ధిక్కార స్వరం వినిపించిన ఆయన.. బాబు ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పోషించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పురిటి వాసన పోకముందే.. చంద్రబాబు నాయుడు దీక్ష చేయడం పట్ల ఆయన మండిపడ్డారు. కొత్త ప్రభుత్వానికి కొంత గడువు ఇవ్వాలన్నారు. తాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నానని వంశీ తెలిపారు. జగన్తో తనకు సంబంధాలు ఉన్నాయన్న ఆయన.. ఎమ్మెల్యే పదవిని వదులుకోవడం తనకు గొప్ప విషయమేం కాదన్నారు. రాజకీయాల మీద, వారసత్వం మీద నాకు నమ్మకం లేదన్న వంశీ.. గత ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేశానన్నారు. ఆర్థిక లావాదేవీలు, కేసులకు భయపడి తాను వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడం లేదన్న వంశీ.. సాధ్యమైనంత త్వరలో జగన్ సమక్షంలో పార్టీ చేరతానన్నారు. జగన్కు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నానని ప్రకటించారు. కేసులు నాకు కొత్త కాదన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో, వెబ్సైట్లలో వార్తలు రాయిస్తున్నారని టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. జగన్ తీసుకొచ్చిన నవరత్నాలు తనకెంతో నచ్చాయన్నారు.