ఐపీఎల్ ప్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్కు టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ట్రేడింగ్ విండో ఆరంభమైన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల బదిలీలకు నవంబర్ 14ని చివరి గడువు తేదీగా ప్రకటించడంతో ఫ్రాంచైజీలు విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నాయి.
ఐపీఎల్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత డిసెంబర్ 19న కోల్కతాలో ఐపీఎల్ వేలం జరగనుంది. హిందూస్థాన్ టైమ్స్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం అజ్యింకె రహానే వచ్చే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రహానే తొమ్మిదేళ్లు ప్రాతినిథ్యం వహించాడు. ముంబైకి చెందిన రహానే ధర రూ. 4 కోట్లు.
ఈ ధరకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇద్దరు ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఐపీఎల్ 2019 సీజన్లో రహానే ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వద్ద రూ. 7.15 కోట్లు నగదు ఉంది.
2008 ఆరంభ సీజన్లో టైటిల్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. ఐపిఎల్ బదిలీ తేదీ ముగిసిన తర్వాత రాజస్థాన్ ఫ్రాంచైజి మరి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో స్టువర్ట్ బిన్నీ, లియామ్ లివింగ్ స్టోన్, అష్టన్ టర్నర్, జయదేవ్ ఉనాడ్కట్లు ఉన్నారు.