జనసేన అధినేత పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ కాదు.. రబ్బర్ సింగ్ అని.. అతడికి స్పృహ లేదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విమర్శించారు. నేడు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు స్క్రిప్ట్ చదవడం తప్ప పవన్ కు ఏమీతెలియదని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ చేస్తున్న మంచి పవన్ రుచించటం లేదని.. కాపులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసినా పవన్ ప్రశ్నించలేదని ఆయన గుర్తుచేశారు. పవన్ బుర్రలో చంద్రబాబు తప్ప మరేమీ లేదని మంత్రి ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఒకసారి తాట తీస్తామంటే... తాము పది సార్లు తాటతీస్తామని నాని విమర్శించారు. పవన్ కల్యాణ్ కుమారుడు చదువుతున్నపాఠశాలలో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారని.. అటువంటి వ్యక్తి ఈ రోజు తమ ప్రభుత్వంపై బురద జల్లడం దారుణని పేర్ని నాని విమర్శించారు.