తమ కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులతో వేధిస్తోందని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. తన భర్తపై ఎలాంటి ఆధారాలు లేకుండానే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. తమ దుస్థితి మరెవరికీ రాకూడదని గవర్నర్ బిశ్వభూషణ్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈరోజు టీడీపీ నేతలతో కలిసి గవర్నర్ ను అఖిలప్రియ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆమె పైవ్యాఖ్యలు చేశారు. మరో టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, పోలీసులను అడ్డం పెట్టుకుని అఖిలప్రియ కుటుంబాన్ని వేధిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని అన్నారు.